టీ10 లీగ్‌కు ఇన్వైట్‌ చేస్తున్న BBL

గ్లోబ్‌మీద క్రికెట్‌కు ఉన్న క్రేజ్‌ తక్కువ చేసి చెప్పలేం. ఏ తరహా క్రికెట్‌నైనా అభిమానులు అదే తరహాలో రిసీవ్‌ చేసుకుంటారు. మ్యాచ్‌లు జరుగుతున్నపుడు అదే జోష్‌ చూపిస్తారు. క్రీడా ప్రపంచంలో ఎప్పుడూ ఏదోకచోట ఏదోక టోర్నమెంట్‌ జరిగే ఆటేదీ అంటే `ఠక్కున క్రికెట్‌ అనే చెప్పాలి. ఇప్పుడు విశాఖ వేదికగా ఐపీఎల్‌ తరహాలో బీబీఎల్‌ లీగ్‌ మొదలవబోతోంది. `డిసెంబర్‌లో విశాఖ వేదికగా ఈ లీగ్‌ టోర్నమెంట్‌ను నిర్వహించనున్నారు. లీగ్‌ టోర్నమెంట్‌ ఏర్పాట్లకు ప్రారంభసూచకంగా లోగో, పోస్టర్‌ను ఆవిష్కరించారు ఏసీఏ అధ్యక్షుడు కేసినేని శివనాథ్‌.
క్రికెట్‌ అంటే పడిచచ్చే కుర్రాళ్లను ఉర్రూతలూగించడానికి -డిసెంబర్‌లో ఈ పండగ రాబోతోంది. అదే బిగ్‌ భారత్‌ క్రికెట్‌ లీగ్‌. సింపుల్‌గా -బీబీఎల్‌! ఐపీఎల్‌ జోష్‌కు ఏమాత్రం తగ్గకుండా.. క్రికెట్‌లో ఓ కొత్త క్రేజ్‌ క్రియేట్‌ చేయడానికి.. ఐపీఎల్‌ తరహాలో క్రికెట్‌ లీగ్‌ నిర్వహణకు విశాఖ శరవేగంగా ముస్తాబవుతోంది. కొద్దిరోజుల క్రితమే లోగో, పొస్టర్‌ను విడుదల చేశారు -ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్‌. విజయవాడ పార్లమెంట్‌ కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో ఆరంభ సూచకంగా లోగో ఆవిష్కృతమైంది.  రాష్ట్రంలోని పలు సెక్టార్లనుంచి లీగ్‌లో కనీసం 100 జట్లు పాల్గొంటున్నట్టు నిర్వాహకులు చెప్తున్నారు. బీబీఎల్‌ ఫౌండర్‌ చారుణ్యసాయి మాటల్లో చెప్పాలంటే.. ‘ఐపీఎల్‌ తరహాలో టోర్నమెంట్‌ను డిసెంబర్‌లో విశాఖపట్నంలో నిర్వహించనున్నాం. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని సెక్టార్లు లీగ్‌లో పాల్గొంటున్నాయి’. బిబిఎల్‌ కో-ఫౌండర్స్‌ భరణి, చైతన్య, జశ్వంత్‌, మనీష్‌, సెక్రటరీ సూరజ్‌, వైస్‌ సెక్రటరీ రోహిత్‌, అడ్వైజరీ హెడ్‌ రవిశంకర్లు.. ప్రస్తుతం నిర్వహణా ఏర్పాట్లలో నిమగ్నమైవున్నారు. 

ఏపీ డెస్టినీ వైజాగ్‌లో డిసెంబర్‌లో నిర్వహించనున్న అసాధారణ టీ10 క్రికెట్‌ టోర్నమెంటే -బిగ్‌ భారత్‌ లీగ్‌. టోర్నీలో పాల్గొనమని క్రికెటర్లను ఆహ్వానిస్తోంది. క్రీడా ప్రతిభను పెంపొందించి.. వివిధ రంగాల్లోని క్రికెట్‌ ఔత్సాహికులను ఒక వేదికమీదకు ప్రయత్నం చేస్తోంది బీబీఎల్‌. కార్పొరేట్లు, స్వతంత్ర జట్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ప్రీమియర్‌ క్రికెట్‌ లీగ్‌ ఇది. ఇ-కామర్స్‌, సాఫ్ట్‌వేర్‌, పబ్లిక్‌ సర్వీస్‌, ప్రైవేట్‌ సెక్టార్‌, ఫైనాన్స్‌, ఫిట్‌నెస్‌, మీడియాహౌస్‌.. ఇలా భిన్నరంగాల కంపెనీల జట్లు ఇందులో పార్టిసిపేట్‌ చేయొచ్చు. క్రికెట్‌ నైపుణ్యాలను ప్రదర్శించడానికి.. ఉత్సాహంగా పోటీల్లో పాల్గొనడానికి అవకాశం కల్పించే మైదానమే -బీబీఎల్‌!!

పదండి.. యాక్షన్‌లోకి దిగుదాం

పెద్ద కార్పొరేషన్‌ సంస్థలు, స్వతంత్ర రంగంనుండి వచ్చిన జట్లను ప్రత్యేకంగా నిలిపే వేదికకానుంది -బీబీఎల్‌. జట్లను నమోదు చేసుకోవాలని, మరపురాని క్రికెట్‌ అనుభూతి కోసం సిద్ధంగా ఉండాలని నిర్వాహకులు ప్రమోషన్లు ఉధృతం చేశారు. కార్పొరేట్లు, కార్పొరేషన్లు, సమూహాలు మరియు ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల క్రికెట్‌ జట్లు 60నుంచి 80వరకూ పాల్గొనే చాన్స్‌ ఉందంటున్నారు బీబీఎల్‌ ఫౌండర్‌ చారుణ్యసాయి. ప్రారంభ లీగ్‌ దశ కోసం పూల్స్‌గా విభజించి.. నాకౌట్‌ ఫార్మాట్‌లో ప్లేఆఫ్‌లు నిర్వహిస్తారట. 900 నుంచి 1300మంది క్రికెటర్లు లీగ్‌లో ఆడతారని, టోర్నమెంట్‌కు భారీగా సందర్శకులు హాజరవ్వొచ్చన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. విజేతలు, రన్నరప్‌లు, ఫెయిర్‌ ప్లే టీమ్‌, బెస్ట్‌ బ్యాట్స్‌మెన్‌, బెస్ట్‌ బౌలర్‌, మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌, మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌, బెస్ట్‌ ఫీల్డర్‌లకు అవార్డులు, ప్రైజులుంటాయని.. ప్రఖ్యాత స్టేడియంలలో మ్యాచ్‌లు నిర్వహిస్తామన్నది నిర్వాహకుల మాట. నామినేటైన క్రికెట్‌ బోర్డ్‌ అంపైర్లతో నిర్వహించే ప్రారంభ బిగ్‌ భారత్‌ లీగ్‌ డిసెంబరు మాసం మొత్తం జరగనుందన్నది బిబిఎల్‌ కో-ఫౌండర్‌ భరణి మాట. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నామినేటెడ్‌ చైర్మన్లు, విద్యా బోర్డు డైరెక్టర్లు, క్రీడాధిపతులు, టెలివిజన్‌ -సినిమా ప్రముఖులు, వ్లాగర్లు, మీడియా సిబ్బంది, ఉన్నతస్థాయి పోలీసు అధికారులను టీ10 లీగ్‌కు ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నట్టు నిర్వాహకులు చెప్పారు. లీగ్‌ ప్రారంభ సూచకంగా తొలిరోజు కొన్ని వినోదాత్మక ప్రదర్శ నలు నిర్వహిస్తామని..ఈవెంట్‌కు అవి ప్రతిష్టను జోడిస్తాయని, ప్రేక్షకులనూ ఆహ్లాదపరుస్తాయని నిర్వాహకులు చెప్తున్నారు.

ఎకో ఫ్రెండ్లీ..  ప్లాంటేషన్‌ ఇనీషియేటివ్‌

బీబీఎల్‌ లీగ్‌ కొత్త పంథాను ఎత్తుకోవడం ఆసక్తికర అంశం. క్రికెట్‌ ఫీల్డ్‌కు పర్యావరణాన్ని అనుసంధానించి ఎకో ఫ్రెండ్లీ ప్రోగ్రాంను రూపొందించారు నిర్వాహకులు. అదే -బిగ్‌ భారత్‌ లీగ్‌లో పాల్గొంటున్న ఆటగాళ్లు.. విధిగా మొక్కలు నాటే కార్యక్రమం. ఒక్కో జట్టు 21 మొక్కలు నాటేలా కార్యక్రమాన్ని డిజైన్‌ చేశారు. ఐడియా విచిత్రంగా అనిపించినా.. పర్యావరణం పట్ల నిర్వాహకుల కమిట్‌మెంట్‌కు ఇది అద్దంపడుతుంది. అడవులను బతికించాలన్న ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ పిలుపుతో స్ఫూర్తిపొంది.. ప్లాంటేషన్‌ ఇనీషియేటివ్‌ కార్యక్రమాన్ని డిజైన్‌ చేసినట్టు బీబీఎల్‌ కో-ఫౌండర్‌ భరణి వెల్లడిరచారు.

టీ10 క్రికెట్‌ లీగ్‌ లక్ష్యం

‘బిగ్‌ భారత్‌ లీగ్‌’ ప్రధాన ధ్యేయం.. అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసే శక్తి క్రీడలకు ఉందని చెప్పడం. వివిధ రంగాలనుంచి క్రికెట్‌ టీంలను బరిలోకి దించడం కేవలం టోర్నమెంట్‌ కోసమే కాదని.. ఆటగాళ్ల ఐక్యతను బలోపేతం చేయడానికేనన్నది నిర్వాహకులు చెప్తోన్న మాట. నిజానికి -ఈ భావన పోటీకి మించిందే. ఇది -ఉమ్మడి మైదానాన్ని పంచు కోవడానికి, సంబంధాలను ఏర్పరచుకోవడానికి, ఐక్యతా భావాన్ని పెంపొందించడానికి, విభిన్న నేపథ్యాల నుండి నిపుణులను ఒకచోట చేర్చడానికి బీబీఎల్‌ ఇతోధిక కృషి చేస్తుందంటున్నారు. స్నేహపూర్వక పోటీలో పాల్గొనడం ద్వారా పరస్పరం నేర్చుకోడానికి, ఉమ్మడి లక్ష్యంకోసం కలిసి పనిచేసే సంస్కృతిని పెంచి పోషించడానికే అంటున్నారు నిర్వాహకులు. సమున్నత ఉద్దేశంతో డిసెంబరులో నిర్వహిస్తోన్న బీబీఎల్‌ టీ10 క్రికెట్‌ లీగ్‌ విజయం సాధించాలని, టోర్నీకి హాజరయ్యే ఆహూతులను సంతృప్తిపర్చి.. ఒక బ్రాండ్‌ క్రియేట్‌ చేయాలని ఆశిద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *